మన దేశంలో తిండి,చదువుకంటే పెళ్లి ఖర్చే ఎక్కువట..తాజా సర్వేల్లోవెల్లడి

మన దేశంలో తిండి,చదువుకంటే పెళ్లి ఖర్చే ఎక్కువట..తాజా సర్వేల్లోవెల్లడి

పెళ్లి..ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ప్రతి ఒక్కరూ పెళ్లిని అప్పు చేసి అయినా సరే గ్రాండ్‌గా చేయాలనుకుంటారు. పెళ్లికి ముందు ఫోటో షూట్, కవర్ సాంగ్, లైవ్ వీడియో అంటూ రకరకాల ట్రెండ్స్‌తో భారీ మొత్తంలో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా భారతీయుల పెళ్లి ఖర్చుపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఓ నివేదికను వెల్లడించింది. సగటు భారతీయలు చదువుతో పోల్చితే పెళ్లిపైనే రెండింతలు అధికంగా ఖర్చు చేస్తున్నారని ఆ నివేదికలో వెల్లడిం చింది.

భారతీయల పెళ్లి మార్కెట్ అనేది రూ.10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని ఆ సంస్థ ఓ అంచనా వేసింది.ఈ ఖర్చు 18 యేళ్ళ వరకు పిల్లల చదువులకు చేసిన ఖర్చుకంటే ఎక్కువ అని తేలింది.  అంతేకాదు ఈ పెళ్లి ఖర్చు కంటే ఆహారం, నిత్యావసరాలు ఖర్చులే తక్కువగా ఉన్నాయట. దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లు అవుతున్నాయని.. అదే చైనాలో అయితే 70 నుంచి 80 లక్షలు, అమెరికాలో 20 నుంచి 25 లక్షలు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా వేసింది. పెళ్లిని ప్రతిష్ఠాత్మకంగా భావించే భారతీయులు తాహతుకు మించి ఖర్చు చేస్తారట.

దేశంలో ఏటా కొనుగోలు చేసిన మొత్తం ఆభరణాలలో దాదాపు 50 శాతం పెళ్లికి సంబంధించినవేనట. భారత్‌లో సగటున ఒక పెళ్లిపై కనీసం రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారట..ఇది చదువుపైన చేసే ఖర్చు కంటే ఇది రెండింతలు ఎక్కువ అని అంచనా వేసింది.అయితే అగ్రరాజ్యం అమెరికాలో విద్యపై చేసే ఖర్చుతో పోలిస్తే పెళ్లిళ్లపై చేసే ఖర్చు సగమే ఉంటుందని ఈ సంస్థ ఆ నివేదికలో వెల్లడించింది.